ఆర్థిక విషయాల్లో స్వీయ నియంత్రణ ఉండాలే కాని గ్లోబలైజేషన్ పేరుతో ఇతర దేశాలపై అతిగా ఆధారపడకూడదని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్ డాక్టర్ వైవీ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇండియా వంటి వర్ధమాన దేశాలు గుడ్డిగా సంపన్న దేశాల ఆర్థిక విధానాలను అనుసరించకూడదన్నారు.
మంగళవారం ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) శత వసంతాల కార్యక్రమం సందర్భంగా ‘ఆర్థికరంగ నియంత్రణ-వర్ధమాన దేశాలు, కేంద్ర బ్యాంక్లు’ అన్న అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో వైవీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఆయా దేశాల నియంత్రణ సంస్థలు నిబంధనలు సవరించుకున్నాయని, కాని అలాంటి అవసరం భారత్కు రాలేదని ఆయన అన్నారు.