Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

నేటి నుంచి అన్నా టీం ప్రచారం

అవినీతిరహిత దేశం కోసం ప్రజలంతా ఓటు వేయాలనే నినాదంతో అన్నా హజారే బృందం శనివారం నుంచి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. అయితే ఏ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగానూ తమ ప్రచారం ఉండదని అన్నా టీం స్పష్టం చేస్తున్నప్పటికీ.. పరోక్షంగా కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చడమే ఎజెండాగా కనిపిస్తోంది. పటిష్ట లోక్‌పాల్ బిల్లు విషయంలో యూపీఏ సర్కారు దేశాన్ని ఎలా మోసం చేసిందనే విషయాలను కరపత్రాల ద్వారా ప్రజల్లోకి  తీసుకెళ్లడానికి బృంద సభ్యులు సిద్ధమవుతున్నారు.

ఎన్నికల బరిలో నిలిచిన పార్టీలకు, ప్రత్యేకించి రాహుల్‌గాంధీ, మాయావతి, ములాయంసింగ్‌లకు అన్నా టీం... ప్రభుత్వం రూపొందించిన లోక్‌పాల్ బిల్లుపై పలు ప్రశ్నలు సంధించనుంది. హరిద్వార్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఈనెల 28 వరకు ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో కొనసాగనుంది. అన్నా టీం కీలక సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్‌బేడీ, మరికొందరు సభ్యులు ఎన్నికల ప్రచార సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.