ఈజిప్టులో ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో దారుణ సంఘటన జరిగింది. ఫుట్బాల్ మ్యాచ్ హింసాత్మకంగా మారింది. అబిమానులు హింసకు దిగడంతో 74 మంది మరణించారు, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈజిప్టు లీగ్ మ్యాచ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎల్- అహ్లీ జీరో జట్టును పోర్ట్ సయీద్ సిటీకి చెందిన ఎల్ - మస్రీ జట్టు ఓడించడంతో ఆగ్రహం చెందిన అభిమానుల హింసకు దిగారు. ఇరు జట్ల అభిమానులు రెండుగా విడిపోయి పరస్పరం రాళ్లు విసురుకున్నారు.
రెఫరీ ఫైనల్ విజిల్ ఇవ్వగానే హింస ప్రారంభమైందని భద్రతాధికారులు చెబుతున్నారు. ఆల్ - మస్రీ జట్టు ఆల్ - అహ్లీ జట్టును 3-0 స్కోరుతో ఓడించింది. అల్ - మస్రీ జట్టు అభిమానులు మైదానంలోకి పరుగెత్తి ఆల్ - అహ్లీ జట్టు అభిమానులపైకి రాళ్లు, బాటిల్స్, ఫైర్ వర్క్స్ విసిరారు. టెలివిజన్ వార్తాకథనాల ప్రకారం - గాయపడినవారిని, క్రీడాకారులను తరలించడానికి ఈజిప్టు అధినేత ఫీల్డ్ మార్షల్ హుస్సేన్ రెండు సైనిక విమానాలను పోర్ట్ సయిద్కు పంపించారు. పెద్ద యెత్తున ప్రజలు వచ్చిన మ్యాచుకు కల్పించిన భద్రత అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కత్తిపోట్ల వల్ల చాలా మంది మరణించినట్లు వైద్య నివేదికలు తెలియజేస్తున్నాయి. మృతుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. దేశ ఫుట్బాల్ చరిత్రలోనే ఇది అత్యంత విషాదమని ఈజిప్టు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.