|
Saturday, 31 July 2010 07:56 |
|
కొలంబోలో గురువారం జరిగిన భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లకు 669 పరుగులు చేసిన భారత్, చివరి రోజైన శుక్రవారం ఆటను కొనసాగించి 707 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్లో 65 పరుగులు వెనకంజలో ఉన్న శ్రీలంక రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి 45 ఓవర్లలో మూడు వికెట్లకు 129 పరుగులు చేసింది. పరణవితన 34, తిలకరత్నే దిల్షాన్ 14, మహేల జయవర్ధనే 5 పరుగులు చేసి అవుట్కాగా, సంగక్కర 42, సమరవీర 10 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. ఇశాంత్ శర్మ 27 పరుగులు చేసి ఫెర్నాండొ బౌలింగ్లో సంగక్కరకు దొరకడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి ప్రజ్ఞాన్ ఒజా 18 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. తొలి టెస్టు మ్యాచ్ ఆడిన సురేష్ రైనా సెంచరీ సాధించాడు. సెవాగ్ 99 పరుగులు చేసి, ఒక పరుగు తేడాతో సెంచరీని కోల్పోయాడు. ఇవే రెండో టెస్టులోని విశేషాలుగా చెప్పుకోవాలి. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు ఆగస్టు 3 నుంచి 7 వరకు జరుగుతుంది. ఈదశలో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ని డ్రాగా ముగించడానికి అంగీకరించారు. మొత్తం మీద ఐదు రోజుల్లో 1,478 పరుగులు నమోదైన ఈ టెస్టులో శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో పరణవితన, మహేల జయవర్ధనే సెంచరీలు సాధించగా, సంగక్కర డబుల్ సెంచరీ చేశాడు. భారత బ్యాట్స్మెన్లో సచిన్ తెండూల్కర్ కెరీర్లో ఐదో డబుల్ సెంచరీని నమోదు చేశాడు.
|