Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

23 తరువాతే విస్తరణ...?

తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవితో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యుడు సి. రామచంద్రయ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కేబినెట్‌లో 23వ తేదీన చేరనున్నారని తెలుస్తుంది. ఈ నెల 19వ తేదిన వారు కిరణ్ కేబినెట్లో చేరతారనే వార్తలు జోరుగా వచ్చాయి.  అయితే 19వ తేదిన కూడా విస్తరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దానిని మరో నాలుగు రోజులకు వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది.

ఈ నెల 23వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం కిరణ్ కుమార్ రెడ్డి హస్తినకు వెళ్తున్న నేపథ్యంలో 23న జరిగే మంత్రి వర్గ విస్తరణలో చిరంజీవికి చోటు కల్పించే అంశంపై అధిష్టానంతో సీఎం చర్చించే అవకాశముంది. కాగా అధిష్టానం కేవలం చిరంజీవి వర్గం నేతలతో విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా పునర్వ్యవస్థీకరణ కోరేందుకు కిరణ్ ఢిల్లీ వెళుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు చిరంజీవితో ఆ పార్టీ నేత గంటా శ్రీనివాస రావు మధ్యాహ్నం భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు కూడా చిరంజీవిని కలవనున్నారు.